1. ఇది దమస్కుకు విచారకరమైన సందేశం. దమస్కుకు ఈ సంగతులు సంభవిస్తాయని యెహోవా సెలవిస్తున్నాడు: “దమస్కు ఇప్పుడు పట్టణం కానీ దమస్కు నాశనం చేయబడుతుంది. దమస్కులో శిథిలాలు మాత్రమే మిగుల్తాయి.
|
2. ప్రజలు అరోయేరు పట్టణాలు విడిచి పెట్టేస్తారు. ఆ ఖాళీ పట్టణాల్లో గొర్రెల మందలు విచ్చలవిడిగా తిరుగుతాయి. వాటిని పట్టించుకొనే వాడు ఎవ్వడూ ఉండడు.
|
3. ఎఫ్రాయిము ప్రాకార పట్టణాలు (ఇశ్రాయేలు) నాశనం చేయబడతాయి. దమస్కులో ప్రభుత్వం అంతమవుతుంది. ఇశ్రాయేలుకు సంభవించినదే సిరియాకు సంభవిస్తుంది. ప్రముఖులంతా తీసుకొని పోబడతారు.” ఆ సంగతులు జరుగుతాయని సర్వశక్తిమంతుడైన యెహోవా చెప్పాడు.
|
4. ఆ సమయంలో యాకోబు (ఇశ్రాయేలు) ఐశ్వర్యం అంతాపోతుంది. వ్యాధి మూలంగా చాలా బరువు తగ్గిపోయినమని షిలా యాకోబు ఉంటాడు.
|
5. ఆ సమయం రెఫాయీము లోయలో ధాన్యపు కోతలా ఉంటుంది. పొలంలో పెరిగిన మొక్కలను పనివాళ్లు ఒక చోట వేస్తారు. తర్వాత మొక్కల నుండి గింజలను వారు కోస్తారు. ధాన్యం వారు కుప్పవేస్తారు.
|
6. ఆ సమయం, ప్రజలు ఒలీవ పండ్లు కోసే సమయంలో ఉంటుంది. ప్రజలు ఒలీవ చెట్లనుండి ఒలీవ పండ్లు రాల్చుతారు. అయితే సాధారణంగా చెట్లకొమ్మలకు కొన్ని ఒలీవ పండ్లు మిగిలిపోతాయి. కొన్ని పై కొమ్మలకు నాలుగైదు ఒలీవ పండ్లు మిగిలి పోతాయి. ఆ పట్టణాలకు గూడ అలానే ఉంటుంది. సర్వశక్తిమంతుడైన యెహోవా ఆ సంగతులు చెప్పాడు.
|
7. ఆ సమయంలో ప్రజలు వారిని చేసిన దేవునివైపు చూస్తారు. వారి కన్నులు ఇశ్రాయేలీయుల పరిశుద్ధుని చూస్తారు.
|
8. ప్రజలు, వారు చేసిన గొప్ప వాటిని నమ్ముకోరు. అబద్ధపు దేవుళ్ల కోసం వారు తయారు చేసిన ప్రత్యేక తోటలకు, బలిపీఠాలకు వారు వెళ్లరు.
|
9. ఆ కాలంలో కోటలుగల పట్టణాలన్నీ ఖాళీగా ఉంటాయి. ఆ పట్టణాలు, ఆ దేశానికి ఇశ్రాయేలు ప్రజలు రాకముందు ఉన్న కొండలు, అడవుల్లా ఉంటాయి. గతంలో ఇశ్రాయేలు ప్రజలు వస్తున్నారంటే ప్రజలంతా పారిపోయేవారు. భవిష్యత్తులో దేశం మళ్లీ ఖాళీగా ఉంటుంది.
|
10. మిమ్మల్ని రక్షించే దేవుణ్ణి మీరు మరచిపోయారు గనుక ఇలా జరుగుతుంది. దేవుడే మీ భద్రతా స్థానం అని మీరు జ్ఞాపకం ఉంచుకోలేదు. చాలా దూర స్థలాల నుండి మీరు కొన్ని మంచి ద్రాక్షా వల్లులను తెచ్చి నాటవచ్చును గాని ఆ మొక్కలు ఎదగవు.
|
11. ఒకనాడు మీరు మీ ద్రాక్ష వల్లులను నాటి, వాటిని పెంచటానికి ప్రయత్నం చేస్తారు. మర్నాడు మొక్కలు పెరగటం మొదలవుతుంది. అయితే కోతకాలంలో మొక్కల నుండి పండ్లు కోయటానికి మీరు వెళ్తారు గాని అవి మొత్తం చచ్చి ఉండటం మీరు చూస్తారు. ఆ మొక్కలన్నింటినీ ఒక రోగం చంపేస్తుంది.
|
12. ఎంతెంతో మంది ప్రజలు చెప్పేది విను. సముద్ర ఘోషలా వారు గట్టిగా ఏడుస్తున్నారు. ఆ ఘోషవిను. ఆ ఏడుపు సముద్రపు ఘోషలా ఉండి. సముద్రంలో అలలూ అలలూ ఢీకొన్న ఘోషలా ఉంది.
|
13. ప్రజలు ఆ అలల్లా ఉంటారు. దేవుడు ఆ ప్రజలతో కఠినంగా మాట్లాడతాడు. వారు పారిపోతారు. ప్రజలు గాలికి కొట్టుకొని పొయ్యే పొట్టులా ఉంటారు. ప్రజలు తుఫానుకు కొట్టుకొని పొయ్యే కలుపు మొక్కల్లా ఉంటారు. గాలి విసురుతుంది కలుపు కొట్టుకొని పోతుంది.
|
14. ఆ రాత్రి ప్రజలు చాలా భయంగా ఉంటారు. తెల్లవారే సరికి ఏమీ మిగలదు. కనుక మన శత్రువులకు ఏమీ లభించదు. వారు మన దేశం వస్తారు. కానీ అక్కడ ఏమీ ఉండదు.
|